జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ గా శ్రీమతి వసంత లక్ష్మి

జీవీఎంసీలో జనసేన ఫ్లోర్ లీడర్ గా శ్రీమతి వసంత లక్ష్మి
డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా శ్రీ దల్లి గోవింద రెడ్డి

విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్ లో జనసేన ఫ్లోర్ లీడర్ గా శ్రీమతి భీశెట్టి వసంతలక్ష్మి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా శ్రీ దల్లి గోవింద రెడ్డిలను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. మున్సిపల్ కార్పొరేషన్ల కౌన్సిల్ లో జనసేన పార్టీ నుంచి నియామకం జరుగుతున్న తొలి పదవులు ఇవి. జనసేన పార్టీలో వీర మహిళలకు పార్టీ అధ్యక్షులు ఎనలేని ప్రాధాన్యాన్ని ఇస్తున్న సంగతి విదితమే. పార్టీ కమిటీలలో కూడా వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు. 33 శాతం పదవులలో వీర మహిళలను నియమించాలని కూడా నిర్దేశించారు. మహిళా సాధికారతను గౌరవిస్తూ పోరాటపటిమ కలిగిన వీర మహిళ శ్రీమతి వసంత లక్షిని జనసేన ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేశారు. జనసేన పార్టీపై గంగపుత్రులు అవిభాజ్యమైన ప్రేమానురాగాలను చూపుతుంటారు. గంగవరంలో గంగపుత్రులు అధికంగా.. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతమంతా మత్స్యకారులే నివసిస్తుంటారు. కార్పొరేషన్ ఎన్నికలలో వారు జనసేన అభ్యర్థిని గెలిపించుకున్నారు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా గంగవరం డివిజన్ నుంచి ఎన్నికైన శ్రీ దల్లి గోవింద రెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేశారు. మత్స్యకారుల పట్ల తనకున్న అభిమానాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అకుంఠిత దీక్షతో శ్రీమతి వసంత లక్ష్మి, శ్రీ గోవిందరెడ్డి కృషి చేస్తారని విశాఖ నగర వాసులకు తెలియచేస్తూ వారిరువురికీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాశీస్సులు అందచేశారు.