దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె..

కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక యూనియన్లు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా కొనసాగుతున్నది. రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక కోడ్‌లను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 16 డిమాండ్లతో తొమ్మిది జాతీయ కార్మిక సంఘాలతోపాటు కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏకమై.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలు, సభలకు కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య, జీవిత భద్రత కల్పించాలని, పనిగంటల పెంపును ఆపి, కనీస వేతనం పెంచాలని కార్మికులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న చట్టాలు కొద్దిమంది కార్పొరేట్లకు సంపదను దోచిపెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయని కార్మికలోకం మండిపడుతోంది.

దేశ్యాప్తంగా ఈ సమ్మె ప్రభావం స్వల్పంగానే ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో కాస్త ఉధృతంగా కొనసాగుతోంది. ప్రధాన వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉత్తర 24 పరగనాస్ జిల్లాలో కార్మిక నేతలు పెద్ద ఎత్తున సమ్మె నిర్వహించారు. రైళ్ల రాకపోకలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సమ్మె కొనసాగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఆటో, టాక్సీ డ్రైవర్లు కూడా రోడ్డుపైకి వాహనాలు తీసుకు రాకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కార్మికుల జీవితాలకు భద్రతను, ఉద్యోగాలకు భరోసాను అందిస్తున్న 44 లేబర్ చట్టాలను కేంద్రం మార్చేసింది. కొత్తరూపంలో మళ్లీ అమల్లోకి తెచ్చింది. 2002లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిన నల్లచట్టాలను మోదీ ప్రభుత్వం ఇటీవలే నాలుగు కోడ్ల రూపంలో తెచ్చింది. వేతనాలు, భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు, సామాజిక భద్రత పేరుతో దారుణ చట్టాలను కార్మికులపై రుద్దుతోందని అంతా మండిపడుతున్నారు. ఈ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చిన వెంటనే కార్మికులకు సంఘాలు పెట్టుకొని, సమ్మెచేసే హక్కులు చేజారిపోతాయి. అనేక పోరాటాల ఫలితంగా 8 గంటల పని విధానం అమల్లోకి రాగా.. ఇప్పుడు మోదీ సర్కారు, యాజమాని కోరుకుంటే 12 గంటల పాటు పనిచేయాలనే విధంగా మార్చేస్తోంది. ప్రజలు కష్టపడి సాధించుకున్న చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మికుల హక్కులను తుంగలో తొక్కే చట్టాలను వ్యతిరేకిస్తామని తేల్చి చెప్తున్నాయి.