పవన్ కల్యాణ్ ఆలోచన- చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం

• వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తాం
• కొత్తపేటలో మీడియాతో జనసేన పి.ఎ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారి సుదీర్ఘ అనుభవం ఎంతో అవసరం. ఇద్దరు నాయకుల నాయకత్వంలో బలంగా ముందుకెళ్లి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధిస్తామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. అతి త్వరలో రెండు పార్టీలు ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్తాయని, వైసీపీ ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తామని తెలిపారు. బటన్లు నొక్కే పద్ధతి కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న శ్రీ మనోహర్ గారు కొత్తపేటలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన, తెలుగుదేశం పార్టీలు త్వరలోనే ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్తాయి. ఇంటింటికి వెళ్లి వైసీపీ వైఫల్యాలను తెలియజెప్పడంతోపాటు సంకీర్ణ ప్రభుత్వంలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరిస్తాం. అంతకంటే ముందు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసికట్టుగా పని చేస్తాం.
• దేశంలోనే ఏకైక పార్టీ జనసేన
దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా పార్టీ క్రియాశీలక సభ్యులను తన కుటుంబ సభ్యులుగా భావించి జనసేన పార్టీ అండగా ఉంటోంది. ప్రమాదవశాత్తు క్రియాశీలక సభ్యుడు మరణిస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసిన రూ.5 లక్షల చెక్కును అందజేసి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నాము. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ రెండు రోజుల్లో 11 చెక్కులు అంటే రూ. 55 లక్షల రూపాయలు పార్టీ తరఫున క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అందజేస్తాం. ఇంతకుముందే అల్లపల్లివారిపాలెంలో శ్రీ బండారు వెంకట రాజు అనే జనసైనికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరఫున రూ. 5 లక్షల చెక్కు అందించాం. ఆయన ఇద్దరి కుమారుల చదువులను జిల్లా నాయకత్వం చూసుకుంటుంది” అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ, కొత్తపేట ఇంచార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్, జిల్లా నాయకులు శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ, శ్రీ తుమ్మల బాబు, శ్రీ వరుపుల తమ్మయ్యబాబు, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ బత్తుల బలరామకృష్ణ, శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీ బొంతు రాజేశ్వరావు, శ్రీ టీవీ రామారావు, శ్రీమతి సుంకర కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
• శ్రీ నాగిరెడ్డి సత్తిబాబు కుటుంబాన్ని పరామర్శించిన శ్రీ మనోహర్
ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ నాగిరెడ్డి సత్తిబాబు కుటుంబాన్ని శ్రీ 

నాదెండ్ల మనోహర్ గారు పరామర్శించారు. శ్రీ సత్తిబాబు స్వగ్రామమైన కొత్తపేట నియోజవర్గం వానపల్లి గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీ సత్తిబాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం శ్రీ సత్తిబాబు గారి భార్య శ్రీమతి నాగిరెడ్డి ముత్యాలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేశారు. పిల్లల చదువుల బాధ్యతను పార్టీ చూస్తుందని భరోసా చెప్పారు.