తాగునీటిని అందించండి మహాప్రభో!

*దాచేపల్లి జనసేన పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ అంబటి సుధారాణి నర్సింహ స్వామి అభ్యర్థన

దాచేపల్లి, తాగునీటిని అందించే మోటార్ ను వెంటనే మరమత్తులు చేయాలని 8వ వార్డు ప్రజలతో కలిసి నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన కౌన్సిలర్ అంబటి సుధారాణి నర్సింహస్వామి. నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజల గోడు పట్టడం లేదా అని అధికారులను నిలదీశారు. స్కూలుకి వెళ్ళే పిల్లలు, వృద్ధాప్యంలోని మహిళలు, దినసరి కూలీ చేసుకునే మహిళలు తాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే గత నెల రోజులుగా పలుమార్లు నాయకులు, అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన సమస్య పరిష్కరించకపోగా సమస్యను మరింత జటిలం చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలనుకోవడం దురదృష్టకరమని అన్నారు. పరిపాలనలో రాజకీయాలను చొప్పించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. త్వరితగతిన సమస్య పరిష్కారం చేయకపోతే పన్నులు కట్టకుండా సహాయనిరాకరణ చేస్తామని మహిళలు వ్యక్తపరిచారు. రెండు రోజుల్లో కొత్త మోటార్ బిగించి ప్రజలకు నీటి సరఫరా చేసి సమస్య పరిష్కారం చేస్తామని, ఈలోపుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని నగర పంచాయతీ కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అంబటి మల్లి,గురజాల నరసింహారావు, వేల్పుల చైతన్య తదితరులు పాల్గొన్నారు.