అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరం

ఆడబిడ్డలపై అత్యాచారాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా అటువంటి ఆలోచనలే మృగాళ్లకు రాకుండా సంస్కరణలు తీసుకురావలసిన బాధ్యత చట్టసభ సభ్యులు, మేధావులు, సంఘ సంస్కర్తలపై ఎంతగానో ఉందని కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న అమానుష సంఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విశ్లేషించారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో తరచూ అత్యాచార ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల శంషాబాద్ పరిసరాల్లో జరిగిన ‘దిశ’ హత్యాచార ఘటన మరువక ముందే, ఈ వారంలో హైదరాబాద్ లో ఓ మైనర్ బాలిక పై జరిగిన అత్యాచారం తీవ్రంగా మనసును కలచివేసింది. కొందరు మైనర్ బాలురు వారు ప్రయాణిస్తున్న కారులోనే అత్యాచారానికి పాల్పడడం మాటలకు అందని దుర్మార్గం. అల్లారుముద్దుగా పెంచుకునే బిడ్డలపై పరులెవ్వరైనా ఒక దెబ్బ వేస్తేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. ఆవేదనకు గురవుతారు. అటువంటిది ఒక సమూహమే ఆ బాలికను చెరపడితే ఆ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయివుంటారో, ఎంత క్షోభకు గురైఉంటారో నేను ఊహించగలను. అటువంటి దారుణ పరిస్థితి పగవారికి సైతం రాకూడదని కోరుకునే భారతీయ సమాజం మనది. అటువంటి సమాజం నుంచి వచ్చిన మన బిడ్డలు రాక్షసులుగా మారి ఇటువంటి నీచాలకు పాల్పడడం ఉపేక్షించడానికి వీలు లేని ఘోరం. ఈ కేసులో పోలీసుల పరిశోధన చురుగ్గా సాగుతున్నప్పటికీ దోషులలో ఏ ఒక్కరు తప్పించుకోకుండా ఈ పరిశోధనను ముందుకు తీసుకెళ్లాలి. ముద్దాయిలు చిన్నవారైనా, పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా పట్టి చట్టం ముందు నిలబెట్టాలి. దోషులకు శిక్ష పడినంత మాత్రాన అత్యాచారానికి బలైన ఆ బాలికకుగాని, ఆమె కుటుంబానికిగాని న్యాయం జరిగిందని భావించకూడదు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. దోషుల కుటుంబాల నుంచి భారీగా నష్టపరిహారం రాబట్టి బాధితురాలికి అందచేయాలి. ఆమె నిలదొక్కుకుని సామాన్య జీవితం కొనసాగించడానికి తెలంగాణ మంత్రివర్యులు, నవతరం నాయకులు శ్రీ కె.టి.రామారావు (కె.టి.ఆర్.) గారు చొరవ చూపాలని శ్రీ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.