ఆర్.ఆర్.ఆర్. చిత్ర గీతానికి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం సంతోషదాయకం

ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని ‘నాటు నాటు…’ గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం భారతీయులందరూ ఎంతో సంతోషించదగ్గ పరిణామమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్న ఈ గీతానికి స్వరకల్పన చేసిన శ్రీ ఎం.ఎం.కీరవాణి గారికి అభినందనలు. తెలుగు గీతానికి ఉన్న కీర్తి ప్రతిష్టలను గోల్డెన్ గ్లోబ్ పురస్కారం మరింత ఇనుమడింప చేస్తుంది. ‘నాటు నాటు’ గీతాన్ని రచించిన శ్రీ చంద్రబోస్, ఆలపించిన గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవలకు ప్రత్యేక అభినందనలు. ఆస్కార్ పురస్కారం కోసం పోటీ పడుతున్న ఈ చిత్రం ఆ వేదికపైనా పురస్కారాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందేలా రూపుదిద్దిన దర్శకుడు శ్రీ రాజమౌళి, చిత్ర కథానాయకులు శ్రీ రాంచరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య అభినందనీయులని పవన్ కళ్యాణ్ కొనియాడారు.