విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

విజయవాడ, నగరంలో ఇటీవల బలవన్మరణానికి గురైన బాలిక ఘటనను నిరసిస్తూ మహిళా సమాఖ్య విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం నాడు స్థానిక హనుమాన్ పేట దాసరి భవనం నందు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

జనసేన పార్టీ మహిళా నాయకురాలు రావి సౌజన్య మాట్లాడుతూ నగరంలో 14 ఏళ్ల బాలిక మరణం ఘటనలో రాజకీయ జ్యోక్యం లేకుండా విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పిల్లల పెంపకంలో నడవడికలో తల్లిదండ్రులు దృష్టి సారించాలని అన్నారు. దేశంలో రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా, అకృత్యాలు నేరాల సంఖ్య పెరుగతూనే ఉందని, చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నేరస్తులను కటినంగా శిక్షించాలని, లేదంటే నేరస్తులు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీపీఐ కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మరియు (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను ఆడ మగ తేడా, వివక్ష లేకుండా సమానంగా పెంచాలని, రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళల పై ఘోరాలు పెరిగిపోయాయని పోలీసు చట్టాలు పటిష్టంగా ఉండాలని అన్నారు. తెలుగు మహిళా రాష్ట్ర నాయకులు కార్పొరేటర్ చెన్ను పాటి ఉషారాణి మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలు నశించి పోయాయని, ఆడవారికి రక్షణ కరువైందని, నేటి తరం యువత డ్రగ్స్ మద్యానికి బానిసలు అయి నేరాలకు పాల్పడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో తొలుత ప్రజా నాట్యమండలి కార్యదర్శి ఎస్ కే నజీర్ “మదమొహం ముదిరిన మృగాళ్ల వేటలో బలౌతున్నరు మన అడపిల్లలు” అంటూ ఆలోచనాత్మక గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి పి రాణి అరసం జిల్లా నాయకులు ఎం.అరుణ కుమార్ , చైతన్య మహిళా సంఘం నాయకులు లక్ష్మి, కే దుర్గ, మహిళాసమాఖ్య నగర నాయకులు దుర్గాసి రమణమ్మ, డి పుష్పవతి, సుజాత, బీసు శాంత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.