విభజిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి

* భీమిలి “వర్చువల్” సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు
“విభజించు-పాలించు” అనే సూత్రంతో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి విధ్వంసకర పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు స్పష్టం చేశారు. భీమిలి నియోజకవర్గ జనసేన కార్యవర్గంతో శ్రీ నాగబాబు గారు గురువారం “వర్చువల్” సమావేశం ద్వారా మాట్లాడారు. భీమిలి నియోజకవర్గం బాధ్యులు శ్రీ పంచకర్ల సందీప్ నేతృత్వంలో నియోజకవర్గంలోని నాయకులు, వివిధ కమిటీల సభ్యులు, క్రియాశీలక కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు భీమిలి నియోజకవర్గంలోని పలు సమస్యలను శ్రీ నాగబాబు గారికి వివరించారు. జనసేన ప్రభుత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రజా ఆమోదయోగ్యమైన పాలన అందించే విధానాల గురించి ప్రధానంగా చర్చించారు. భీమిలి నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం పని చేయాలని జన సైనికులకు, వీర మహిళలకు సూచించారు. జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి, పార్టీ అంతర్గత క్రమశిక్షణ, నిర్వహణ బాధ్యులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గం కార్యవర్గంతో “వర్చువల్” సమావేశం ద్వారా ముఖాముఖి చర్చించడం సంతోషంగా ఉందని, మున్ముందు ప్రత్యక్ష సమావేశాల ద్వారా అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని వెల్లడించారు.