మనది జనసేన కుటుంబం అని గర్వంగా చెప్పుకొందాం

• క్రియాశీలక సభ్యత్వం ఓ భావోద్వేగ ప్రయాణం
• ఆపదలో ఉన్న తోటి కార్యకర్తకు సాయంగా నిలవాలన్నదే శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పం
• మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
• కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ సమీక్షలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్
నాదెండ్ల మనోహర్ గారు

‘జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేది ఓ భావోద్వేగ ప్రయాణం.. జనసేన పార్టీలో సభ్యులంతా ఒకే కుటుంబం అని చాటి చెప్పే గొప్ప ప్రయత్నం. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసేన క్రియాశీలక సభ్యులకు అనుకోని ప్రమాదంలో చిక్కుకొని కష్టాల్లో ఉంటే ఆర్థికంగా చేయూతనివ్వాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగలా జరగడం, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకునేందుకు ముందుకు రావడం గొప్ప విజయం అన్నారు. జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్వత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 10వ తేదీ, శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు విధివిధానాలు, నిబంధనలు, కార్యక్రమ ఉద్దేశాలను వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘గతంలో జనసేన పార్టీ కార్యకర్తలకు కష్టం వస్తే అంతా ముందుండి, సమష్టిగా సాయం చేసేవాళ్లం. దీనిని ఓ క్రమపద్ధతిలో బీమాగా రూపొందించిన ఆలోచన శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు కష్ట సమయంలో నిలబడాలనేది పార్టీ ఆశయం. మొదట్లో 90 వేల మంది క్రియాశీలక సభ్యులను జాయిన్ చేశాం. కోవిడ్ సమయంలోనూ రూ.500 కట్టి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తర్వాత ఈ సంఖ్య బాగా పెరిగింది. రెండో విడతలో ఏకంగా 3 లక్షల 30వేల మంది క్రియాశీల సభ్యులుగా చేరారు. ఈసారి ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. క్రియాశీలక కార్యకర్తకు కష్టం వస్తే, మనమంతా ఉన్నామనే భరోసా వారికి ఇస్తున్నాం. బాధితులకు బీమా క్లైయిమ్ కూడా 60 రోజుల్లో అందేలా పార్టీ లీగల్ విభాగం ప్రయత్నిస్తోంది. సభ్యత్వ నమోదు కోసం కేవలం పార్టీ కార్యకర్తలే కాదు.. సగటు కూలీలు, పేదలు కూడా ఎదురుచూడటం గొప్ప విషయం. గత ఏడాది సభ్యత్వ నమోదు గడువు పూర్తయినా, రాజమహేంద్రవరంలో కొబ్బరిబొండాలు అమ్మే కొందరు కూలీలు గడువు పెంచాలని స్వయంగా కోరడం ఆశ్చర్యానికి గురి చేసింది.

తమకు రావల్సిన డబ్బులు వారంలో అందుతాయని, అప్పుడు కచ్చితంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటామని వారు చెప్పి గడువు పెంచాలని కోరారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాలుపంచుకోవడం వాలంటీర్లు అదృష్టంగా భావించండి.. సాటి మనిషిని ఆదుకునే గొప్ప కార్యంగా అనుకోండి. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ తన కార్యకర్తల కోసం రూపొందించని కార్యక్రమం జనసేన పార్టీ చేపట్టింది. ముఖ్యంగా యువతను గుర్తించాలి.. వారు పార్టీకి వెన్నెముక. క్రియాశీలక సభ్యత్వంలో వారిని ఎక్కువగా భాగస్వాములను చేసేలా పనిచేయాలి. కేవలం కొందరు వ్యక్తులకే కాకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎక్కువమంది పాలుపంచుకునేలా విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ మాకు జనసేన కుటుంబం అండగా ఉందని భరోసా నింపేలా ఈ కార్యక్రమం ముందుగా సాగాలి. బీమాకు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకోవడంతో పాటు క్రియాశీలక సభ్యులకు ఐడీ కార్డులు, అధ్యక్షుల వారి మనోగతం పుస్తకం, బుక్ లెట్, డిజిటల్ బీమా పత్రం అందిస్తున్నాం. గతంలో మాన్యూవల్ లో చేసే నమోదు ప్రక్రియ పూర్తిగా డిజిటలైజ్ చేశాం. సహనం, ఓర్పుతో కార్యక్రమం విజయవంతం అయ్యేలా పని చేయాలి’’ అని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం, పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్, ఐటీ విభాగం ఛైర్మన్ మిరియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.