పాలకపక్షం అండతో ఎర్రచందనం స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు

• కానిస్టేబుల్ ను వాహనంతో ఢీకొట్టి హత్య చేస్తే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది?
శేషాచలం అడవుల్లోంచి విలువైన ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించేస్తున్న ముఠాలను వైసీపీ పెంచి పోషిస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. పాలకపక్షం అండతోనే స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. అన్నమయ్య జిల్లాలోని కె.వి.పల్లి మండలంలో పోలీసు కానిస్టేబుల్ శ్రీ గణేశ్ ను ఎర్ర చందనం తరలిస్తున్న వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన దుర్మార్గపు ఘటన వెనక ఎవరు ఉన్నారో వెల్లడి కావాలి. కానిస్టేబుల్ శ్రీ గణేశ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం. దోషులను కఠినంగా శిక్షించాలి. ఎర్ర చందనం స్మగ్లర్లు ఇంతటి దురాగతానికి పాల్పడ్డా ఆ ముఠా వెనక ఎవరు ఉన్నారో పోలీసులు వెల్లడించకుండా గోప్యత పాటించడం పలు సందేహాలకు తావిస్తోంది. అటవీ శాఖ స్వాధీనంలో ఉన్న ఎర్ర చందనాన్ని అంతర్జాతీయ మార్కెట్లో సక్రమంగా విక్రయించలేకపోతోంది వైసీపీ ప్రభుత్వం. స్మగ్లర్లు మాత్రం యధేచ్చగా రాష్ట్రం సరిహద్దులు దాటించేస్తున్నారు. అరుదైన ఎర్ర చందనాన్ని కాపాడాల్సిన బాధ్యతను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని శ్రీ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.