సైనిక వీరుల త్యాగఫలం కార్గిల్ విజయం

భారత సైనిక వీరుల త్యాగఫలం కార్గిల్ విజయ్ దివస్ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో శ్లాఘించారు. 1999 జులై 26 భారత సైనికులు శత్రుమూకలను తరిమికొట్టి కార్గిల్ కొండలపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన చారిత్రాత్మక శుభదినం. భారత సైనికుల ధైర్య సాహసాలు, వీరోచిత పోరాటాలు చూసి ప్రపంచం అచ్చెరువొందిన రోజు. అయితే ఈ విజయ సాధనలో 527 మంది సైనికులు వీర మరణం పొందడం గుండెలను పిండేసే వాస్తవం. ఈ పోరాటంలో ప్రాణాలను అర్పించిన భారత సైనికులకు శిరస్సు వంచి వందనం చేస్తున్నాను. వారి ధీరత్వానికి జోహార్లు అర్పిస్తున్నాను. భారత సైనిక పాటవాన్ని, సైనికుల పోరాటపటిమను తక్కువగా అంచనా వేసిన పాకిస్థాన్ దుర్బుద్ధితో, కుటిల నీతితో మన సరిహద్దులు దాటింది. తన పారామిలటరీ దళాలను వేర్పాటువాదుల రూపంలో కార్గిల్ ప్రాంతానికి పంపి సుమారుగా 200 కిలోమీటర్ల విస్తీర్ణంలోని భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న దుర్మార్గపు వేళ మన సేనలు చేసిన పోరాటం చిరస్మరణీయం. శత్రువులను తరిమివేయడానికి భారత సైనికులు చూపిన తెగువ, పోరాటం గురించి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వాతావరణంలో శత్రువులకు ఎదురెళ్లితే ప్రాణాలు పోవడం ఖాయమని తెలిసినా.. దేశం కోసం, కోట్లాది మంది ప్రజల భద్రత కోసం శత్రు మూకలతో పోరాడి మన దేశ భూభాగాన్ని రక్షించిన వారి త్యాగం ఎంత కీర్తించినా, మరెంత పొగిడినా తక్కువే. ఈ విజయ భేరిలో నినదించిన ప్రతి సైనికునికి, వారి కుటుంబాలకు భరత జాతి సర్వదా రుణపడి ఉంటుంది. అమరుల త్యాగాలను స్మరించుకుంటూనే ఉంటుంది అని జనసేనాని పేర్కొన్నారు.