అందరి గుండెల్లో అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి నిలిచే ఉంటుంది

ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి జనసేన తరఫున, జనసైనికుల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియచేస్తూ స్వాగతం పలుకుతున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మనందరి గుండెల్లో స్ఫూర్తిని నింపే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకు నరేంద్ర మోదీ గారు వస్తుండడం ఆనందదాయకం. ప్రత్యేకంగా భీమవరంలో పోటీ చేసిన నాకు ఈ వేడుక ప్రత్యేకం. ఈ కార్యక్రమానికి నాకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. సోమవారం జరగబోయే కార్యక్రమంలో జనసేన ప్రాతినిధ్యం వహించాలని పార్టీ నాయకులకు సూచించాను. ఈ విగ్రహావిష్కరణతో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఒక మహా యోధుడయిన అల్లూరి సీతారామరాజు గారి తాలూకు గొప్పతనం ప్రపంచం యావత్తు తెలుస్తుంది. ఆ విధంగా మనందరం ఎంతో అదృష్టవంతులం. ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోదీ గారికి మరోమారు తెలుగు ప్రజల తరఫున, ఆంధ్రా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.