అచ్యుతాపురం సెజ్ లో ప్రమాదాలు ఆగేదెప్పుడు?

• ఇద్దరు కార్మికుల మరణం బాధాకరం
ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ప్రమాదాలు పరిపాటిగా మారిపోవడం విచారకరమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఫార్మా కంపెనీలో నేడు జరిగిన భారీ పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. గత రెండు మూడేళ్లుగా ఎల్జీ పాలిమర్స్, సైనార్ ఫార్మా, రామ్ కీ సాల్వెంట్ ఇండస్ట్రియల్ ప్లాంట్ తదితర కర్మాగారాల్లో జరిగిన ప్రమాదాల్లో సంభవించిన ప్రాణనష్టం ఆందోళన కలిగించే స్థాయిలో ఉండడం గమనార్హం. ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? మానవ తప్పిదమా? అలక్ష్యమా? సరైన ప్రమాణాలు పాటించకపోవడమా? నిర్ధిష్టమైన యంత్రపరికరాలు వాడకపోవడమా? అన్న సంగతి అధికారులు ఎప్పటికప్పుడు విచారణ జరిపించి బాహ్య ప్రపంచానికి వెల్లడించవలసి ఉంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే మొక్కుబడిగా విచారణ జరిపి ఫైలు మూసేయడం కారణంగా మిగిలిన వారిలో ఒక రకమైన నిర్లక్ష్య భావన చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు సాహితీ ఫార్మాలో ప్రమాదం జరిగినట్టు సమాచారం అందుతోంది. తరచూ ఇటువంటి ప్రమాదాలు జరగడం అనర్ధదాయకం. ఇకనైనా అధికారులు మేల్కొని ప్రమాదాలు జరగకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం సంభవించకుండా ప్రమాణాలు పాటించాలి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్దిస్తూ వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను. బాధిత కుటుంబాలకు ఇతోధికంగా నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తీవ్రంగా గాయపడిన నలుగురికి మేలైన వైద్య సాయం అందించాలి. వారి ప్రాణాలు కాపాడాలని అధికారులను జనసేనాని కోరారు.