కేసీఆర్ పిలుపుతో ముందుకొచ్చిన టాలీవుడ్ హీరోలు: భారీగా విరాళాలు

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామిక వేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ పిలుపుతో  తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు రూ.కోటి రూపాయలు, నాగార్జున రూ. 50 లక్షలు, ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, హరీష్ శంకర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 లక్షలు విరాళం అందించేందుకు సిద్ధమయ్యారు.

గడిచిన వందేళ్ళలో ఎప్పుడు లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వలన హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత వాళ్ళు సాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అని చిరు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

భారీ వర్షాలు, వరదల వలన హైదరాబాద్ నగర ప్రజల జీవితం దుర్భరంగా మారింది. వారి బాగోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు విడుదల చేయడం హర్షణీయం. ఈ విపత్తు వలన నిరాశ్రయులైన వారికి నా వంతు సాయంగా రూ. 50 లక్షల రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నాను అని నాగార్జున పేర్కొన్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ వర్షాలు , వరదలతో హైదరాబాద్ లో చాలా మంది జీవితాలు నాశనమయ్యాయి. మన నగర పునరావాసం కోసం తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు అందిస్తున్నాను. మనమందరం చేతనంత సాయం చేసి హైదరాబాద్‌ను పునర్నిర్మించుకుందాం అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

గతంలో వరదలు వచ్చినప్పుడు కేరళ, చెన్నై ప్రజలకు సాయం చేశాం. ఆర్మీకు కూడా మనవంతు సాయం చేశాం. కరోనా సమయంలోను విరాళాలు అందించాం. ఇప్పుడు మన నగరాన్ని రక్షించుకోడానికి అందరం కలిసి ముందుకు సాగాలి. ఇందుకు గాను నా వంతు సాయంగా రూ. 10 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించాను అని విజయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.