క్రీడాకారులకు జనసేన తరఫున అండగా ఉంటాం: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి: జాతీయస్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లా నుంచి వెళ్తున్న క్రీడాకారులకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తన వంతుగా శనివారం చిరు ఆర్థిక సాయంగా కొంత నగదుతోపాటు బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఈనెల 19 నుండి మూడు రోజులపాటు అనంతపురం జిల్లా, ఉరవకొండలో జరిగే జాతీయస్థాయి క్రీడా పోటీల్లో నెల్లూరు జిల్లా నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే 18 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న 18 మంది క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందలేదు. కనీసం రవాణా సౌకర్యం కూడా వీరికి లేదు. జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనందుకు వెళ్తున్న క్రీడాకారులకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి తాము అండగా ఉంటాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే క్రీడాకారులకు క్రీడరంగంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించినట్లయితే మరింతగా రాణిస్తారు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో బయట ప్రాంతాల్లో జరిగే క్రీడా పోటీలకు పాల్గొనేందుకు వెళ్లే క్రీడాకారులకు ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం క్రీడా పోటీల్లో క్రీడాకారులకు ఎందుకు ఆర్థిక సాయం అందించడం లేదు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రజా ప్రతినిధులపై ఉంది. నెల్లూరు జిల్లా నుంచి వెళ్లిన 18 మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని మహాశివరాత్రి సందర్భంగా ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సురేష్ నాయుడు అన్నారు.