ఏపీఎస్డీసీ ద్వారా తీసుకొచ్చిన అప్పుల్లో రూ.6 వేల కోట్లు ఏమయ్యాయి?

* ఎవరి అభివృద్ధి కోసం ఎటు మళ్లించారు?
* రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ను అప్పుల కార్పొరేషన్ గా మార్చేశారు
* మద్యపాన నిషేధం అని చెప్పి అమ్మకాలను భారీగా పెంచారు
* మద్యంపై వస్తున్న ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నారు
* మ్యానిఫెస్టోలో మద్య నిషేధం అని చెప్పారు.. ఇప్పుడు ఆ హామీయే లేదు అంటున్నారు
* మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ)ను రాష్ట్ర అప్పుల కార్పొరేషన్ గా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఏపీఎస్డీసీ ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని, నాణ్యమైన విద్య, మహిళా సాధికారిత సాధిస్తామని గొప్పలు చెప్పి అప్పులు తీసుకొచ్చిన నాయకులు… దొడ్డిదారిన జేబులు నింపుకొన్నారని తెలిపారు. ఈ కార్పోరేషన్ ద్వారా తెచ్చిన అప్పుల్లో రూ.6 వేల కోట్లు ఏమైపోయాయో లెక్కలు తేలలేదు అని స్పష్టం చేశారు. అవి ఎటుపోయాయి.. ఎవరి అభివృద్ధి కోసం మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన రూ. 23 వేల కోట్ల రుణాల్లో అమ్మఒడి, చేయూత, ఆసరా పథకాలకు రూ. 16,899 కోట్లు ఇవ్వగా మిగిలిన కోట్లు సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఈ అప్పుల వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ప్రభుత్వం 2020 ఆగస్టులో ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా ప్రతి పౌరుడికి చక్కటి సేవలు అందిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, పేదలకు గృహాలు కల్పిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ను వ్యతిరేకిస్తే… వారిని మభ్య పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చని జస్టిస్ మిశ్రా దగ్గర నుంచి లేఖను తీసుకొచ్చి ఇచ్చారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొదటి ఏడాదిలోనే మోసం చేయాలనే ఒక ప్రణాళికతో బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్లు రుణాలు తీసుకున్నారు. రుణాలు తిరిగి చెల్లించడానికి ఎస్ర్కో అకౌంట్లు ప్రభుత్వం ప్రారంభించింది.
* రాజ్యాంగ విరుద్ధం… ఆర్థిక క్రమశిక్షణ లేదని కేంద్రం చెప్పింది
రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ రాజ్యాంగ విరుద్ధమని, ఆర్థిక క్రమశిక్షణకు విఘాతం అని గత ఏడాది పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. రుణాలు మంజూరు చేయడంపై బ్యాంకులను హెచ్చరించారు. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 7 నుంచి 9 శాతం వడ్డీకి రూ. 23 వేల కోట్లు రుణాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు మళ్లించింది. అభివృద్ధి, మౌలిక సదుపాయలకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. కార్పొరేషన్ మొదలు పెట్టినపుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటి? ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడు భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా గ్యారెంటీలుగా చూపించి అప్పులు తెస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లో రూ.41 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారు.
* మద్యం అమ్మకాలు ఏడాదికి రూ. 25 వేల కోట్లు
గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఏడాదికి రూ. 25 వేల కోట్లు చొప్పున మద్యం అమ్మకాలు జరిగాయి. దీనిపై రాష్ట్రానికి ఎక్సైజ్ ఆదాయం కోట్లలో ఉంది. ఈ ఆదాయం ఎక్కడికి పోతోంది? మ్యానిఫెస్టోనే మాకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ అని చెప్పారు. అధికారంలోకి రాగానే మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశాకే మళ్లీ ఓటు అడుగుతామన్నారు. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ మంత్రే మద్యపాన నిషేధం హామీని అసలు మ్యానిఫెస్టోలోనే పెట్టలేదని అంటుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు. మీరు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అనుకొనే మ్యానిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఆ కాపీలు పంపుతాం. చదువుకోండి. అప్పులు తెచ్చి ఆసుపత్రులు, స్కూళ్లు కడతామని చెప్పారు. అవి లేవుగానీ కొత్త బార్లు మాత్రం వచ్చాయి. మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవడానికి తాజాగా మరో 840 బార్లకు లైసెన్సులు ఇచ్చారు. ప్రతి జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది 40 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. కొన్ని జిల్లాల్లో 70 శాతం వరకూ ఆదాయం పెరిగింది. మద్యం డిపోలు, వాటిలోని నిల్వలు, వ్యాపారం, సరఫరాదారులతో కుదిరిన ఒప్పందాలు వీటన్నింటినీ ఏపీ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బదలాయించి రాబోయే కొన్నేళ్లపాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి రూ. 40 వేల కోట్లు రుణాలు తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడికిపోతుందో ప్రభుత్వం చెప్పాలి. వేల కోట్లు ఆదాయం వస్తున్నా ఎందుకు అభివృద్ధి చేయడం లేదో ప్రజలకు వివరించాలి. కనీసం రోడ్లు ఎందుకు వేయలేదు? పరిశ్రమలు స్థాపించి ఉపాధి ఎందుకు కల్పించలేదో ప్రజలకు వివరించాలి. ప్రతి పేదవాడికి ఇళ్లు అని చెప్పి ప్రారంభించిన జగనన్న కాలనీల్లో వేల కోట్లు అవినీతి జరిగింది.
* జగన్ వ్యక్తిగత ఇష్టానికి తగ్గట్టే నిధుల కేటాయింపు
పాలకులు దురాలోచనలతో కాకుండా దూర ఆలోచనతో పనిచేయాలి. కేంద్ర పెద్దలు కూడా ఏపీ అప్పుల విషయంలో స్పందించాలి. బటన్ నొక్కి అన్నీ చేస్తున్నాం అని జగన్ చెబుతున్నారు. ఆ డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో ప్రజలకు వివరించాలి. ఏ బడ్డెట్ లో అయినా… ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో జగన్ వ్యక్తిగత ప్రాధాన్యతను బట్టి నిధులు ఇచ్చారు. ఆర్.బి.ఐ గైడ్ లైన్స్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఏ రాష్ట్రానికైనా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఎంతో అవసరం. భవిష్యత్తులో ఏపీలో చాలా గడ్డు పరిస్థితులు రానున్నాయి. ప్రజలు కూడా ఒకసారి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాల పై ఆలోచన చేయాలి. కేంద్రం ఏ నిర్ణయం చేసినా… జగన్ ఒక్క మాట కూడా అనలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారే కేంద్రం నిర్ణయం సరి కాదని గళమెత్తారు. ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరిగే అంశాల పై జనసేన స్పందిస్తుంది. మా ఒత్తిడి వల్లే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పనులు ఆగాయి. అమరావతి అభివృద్ధి, పోలవరం విషయాల పై కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర పెద్దలతో మాట్లాడారు.
* తదుపరి కడప జిల్లాలో జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర
రైతుల ఆత్మహత్యల వివరాలను గత రెండేళ్లుగా కేంద్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. కావాలనే రైతుల ఆత్మహత్యలను దాచి పెడుతున్నారు. కడప జిల్లాలో ముందుగా అనుకున్న దాని కంటే గత మూడేళ్లలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. తాజాగా మాకు అందిన లెక్కల ప్రకారం కడప జిల్లా మొత్తం మీద 167 మంది కౌలు రైతులు గత మూడేళ్లలో వివిధ కారణాలరీత్యా బలవన్మరణానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోనే 41 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా వచ్చిన లెక్కలు చూసి మాకే చాలా ఆవేదన కలిగింది. త్వరలోనే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలుసుకొని వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా నిలబడి భరోసా నింపుతారని” తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పెదపూడి విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, బేతపూడి విజయ్ శేఖర్ పాల్గొన్నారు.