కౌలు రైతు శ్రీ చిన్న హుస్సేనీ కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సాయం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న మరో కౌలు రైతు శ్రీ దూదేకుల పండ్లాపురం చిన్న హుస్సేనీ కుటుంబానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం అందచేశారు. వ్యవసాయంలో అప్పులపాలు కావడంతో శ్రీ హుస్సేనీ ఏడాదిన్నర క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాత్రలో భాగంగా నంద్యాల జంక్షన్ వద్ద శ్రీ హుస్సేనీ భార్య శ్రీమతి పండ్లాపురం శామిర్ బీ, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐదు ఎకరాల్లో మిర్చి, ఐదు ఎకరాల్లో జొన్న సాగు చేయగా పంట నష్టం, గిట్టుబాటు దక్కక నష్టం వచ్చినట్టు ఆమె పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఇంటి పెద్ద చనిపోయి దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి కనీసం పలకరింపు కరువయ్యిందని వాపోయారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని చెక్కు రూపంలో శ్రీమతి శామిర్ బీకి అందచేశారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నాయకులు డా. బాల వెంకట్, అర్షద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.