క్రియాశీలక సభ్యులకు అవగాహన తరగతులు

•2వ తేదీన వీర మహిళలకు అవగాహన కార్యక్రమం
జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరించేందుకు పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన, పునశ్చరణ తరగతులను నిర్వహించబోతున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత, వీర మహిళలు చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, 3.50 లక్షల మంది క్రీయాశీలక సభ్యులను చేర్చేందుకు జనసైనికులు, వీరమహిళలు చేసిన కృషి అద్భుతం. రాజకీయాల్లో ఇది గొప్ప స్ఫూర్తిమంతమైన కార్యక్రమం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, ఆయన భావజాలాన్నిక్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో వారు విజయం సాధించారు. దీనికి అనుగుణంగా క్రియాశీల సభ్యులకు పార్టీ సిద్ధాంతాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు, పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా జులై 2వ తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా వీర మహిళలతో నిర్వహించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎంపిక చేసిన వీర మహిళలు ఈ తరగతులకు హాజరు కావాలి. 2వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఈ పునశ్చరణ తరగతుల్లో వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారు. పార్టీకి మరింత ఉత్తేజం నింపేలా, క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలనే విషయాలను వివరిస్తారు. భవిష్యత్ కార్యాచరణను విపులంగా చెబుతారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎలా పనిచేయాలో చర్చిస్తారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఆరు నెలల్లో ఓ గొప్ప యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో ఉండే క్రియాశీలక సభ్యులకు ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు వరుసగా ఉంటాయ”ని తెలిపారు.