సాహిత్య అకాడమీ పురస్కార విజేతలకు అభినందనలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్

తెలుగు సాహిత్య రంగానికి నిరుపమాన సేవలు అందిస్తున్న శ్రీ గోరేటి వెంకన్న, విజ్ఞాన వికాస రచయిత శ్రీ దేవరాజు మహారాజు, యువ రచయిత శ్రీ తగుళ్ల గోపాల్ లు సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికకావడం తెలుగువారందరికీ గర్వకారణమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కొనియాడారు. ఈ తెలంగాణ ముద్దు బిడ్డలకు మనసారా అభినందనలు తెలుపుతున్నాను. జానపద గీతాలు, గేయాలపై తెలుగువారి మక్కువను శ్రీ గోరేటి వెంకన్న మరింత ఇనుమడింపచేస్తున్నారు అనడం ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. గ్రామీణ జీవనం, కుల వృత్తుల నేపథ్యంగా ఆయన ఆలపించే గీతాలు ఆలోచింపచేసివిగా, చైతన్యం నింపేవిగా ఉంటాయి. ఎంత ఎదిగినా ఒదిగివుండే ఆయన జీవన వైశిష్ట్యం ఆయనలోని మరో గొప్ప సుగుణం. శ్రీ దేవరాజు మహారాజు, యువ రచయత శ్రీ తగుళ్ల గోపాల్ లు తెలుగు సాహిత్య రంగానికి చేస్తున్న కృషి సర్వదా ప్రశంసనీయం. ఈ సాహిత్య సేవ ఇలాగే కొనసాగాలని, సాహిత్య రంగంలో మరింత ఉన్నత స్థానం పొందాలని కోరుకొంటూ ఈ ముగ్గురు విశిష్ట రచయితలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని జనసేనాని పేర్కొన్నారు.