2022లో ఘనమైనరీతిలో ప్రజల ముందుకు వెళ్ళి వారికి అండగా నిలుద్దాం: నాదెండ్ల మనోహర్

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. గడచిన యేడాది కంటే కొత్త సంవత్సరం మరింత మేలు చేస్తుందని ఆకాంక్షిస్తున్నానని… ఒక్కసారి 2021ని సమీక్షించుకొంటే జనసేన పార్టీ సమధికోత్సాహంతో ప్రజా క్షేత్రంలో నిలిచింది. మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ – దివీస్ కాలుష్యంపై బహిరంగ సభ నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష వరకూ చేపట్టిన ప్రతి పోరాటం ప్రజల కోసమే. రాష్ట్ర రహదారుల దుస్థితిని ప్రపంచానికి చూపించాం. శ్రమదానంతో రోడ్లకు మరమ్మతులు చేసి పాలకపక్షానికి చురుకు పుట్టిందాం. ఈ కార్యక్రమాల విజయంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళల భాగస్వామ్యం అభినందనీయమైనది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయమైన విజయాలు దక్కించుకున్నదీ 2021లోనే, రాష్ట్ర, జిల్లా కమిటీలు, మండలాధ్యక్షుల నియామకాలతో, క్రియాశీలక సభ్యత్వ నమోదు తదితర కార్యక్రమాలతో పార్టీ క్షేత్రస్థాయి వరకూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది. 2022లో ఇంతకంటే ఘనమైనరీతిలో ప్రజల ముందుకు వెళ్ళి వారికి అండగా నిలుద్దాం అని జనసేన పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ అన్నారు.