కైకాల సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలి

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ నటులు శ్రీ కైకాల సత్యనారాయణ గారు తుదిశ్వాస విడిచారనే విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా కుటుంబానికి శ్రీ సత్యనారాయణ గారు సన్నిహితులు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి అన్నయ్య చిరంజీవి గారితోను, మాతోనూ ఆప్యాయంగా ఉండేవారు. ఇటీవల ఆయనతో మాట్లాడాను. వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకున్నాను. శ్రీ సత్యనారాయణ గారిని అభిమానులు నవరస నటనా సార్వభౌమ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతినాయక పాత్రలను ఎంత అవలీలగా పోషించారో అదే స్థాయిలో కరుణరస ప్రధానమైన పాత్రల్లోనూ ఒదిగిపోయారు. పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. తెలుగువారికి యమధర్మరాజు అంటే శ్రీ సత్యనారాయణ గారే. ఆ పాత్రలో మరొకరిని ఊహించలేని విధంగా చేశారు. ఏ తరహా పాత్రనైనా ప్రేక్షకుల మెప్పు పొందేలా నటించారు. నిర్మాతగాను మంచి చిత్రాలు అందించారు. లోక్ సభ సభ్యుడిగా ప్రజా జీవితంలో ఉన్నారు. తెలుగుదనం మూర్తీభవించిన సత్యనారాయణ గారు లేని లోటు తెలుగు చిత్రసీమలో తీర్చలేనిది. కైకాల సత్యనారాయణ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.