ప్రజల విజయం అంటే రాష్ట్రం గెలవడం… రాష్ట్రం గెలవడం అంటే జగన్ రెడ్డి ఓడటం…

• రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఈ ప్రభుత్వాన్ని దించాలి
• రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు అందుకు కలసి రావాలి
• వైసీపీ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది
• ప్రజా విజయం కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుంది
• శ్రీ జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేశారు
• చిన్న చిన్న సమస్యలు కూడా ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉంటున్నాయి
• తెనాలిలో మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా విజయం కోసం ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజల విజయం అంటే రాష్ట్రం గెలవడం.. రాష్ట్రం గెలవడం అంటే జగన్ రెడ్డి ఓడడం అని ప్రజలు గెలవాలి.. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకూడదన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్నే చెబుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు శ్రీ జగన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు కృషి చేయాలన్నారు. మార్పు రావాలి అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ప్రజల గెలుపు కోసం ఆలోచించేవారు ఒకటి కావాలన్నారు. అంతా ఒక మాట మీద ముందుకు వెళ్లాలి అన్నారు. అందుకోసం వైసీపీ ప్రభుత్వం గెలవకూడదన్న ఆకాంక్ష కలిగిన ప్రతి ఒక్కరు కలసి రావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని, అలాంటి ప్రజా విజయం కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తోందని తెలిపారు. ప్రజల విజయం కోరుకునే వారంతా జనసేన పార్టీతో కలసి వస్తారని చెప్పారు. ఆదివారం సాయంత్రం తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఈ ప్రభుత్వం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. శ్రీ జగన్ రెడ్డి ప్రజల్ని దారుణంగా మోసం చేశారు. ఇలాంటి ప్రభుత్వం మనుగడ సాగించరాదనే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్ఫూర్తితో ముందుకు వచ్చారు. ఒక వ్యూహంతో కలసి కట్టుగా ముందుకు వెళ్తే శ్రీ జగన్ రెడ్డి గద్దె దిగక తప్పదు. పార్టీలపరంగా ఎవరికెన్ని సీట్లు వస్తాయి అనే అంశాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో అధికార మార్పు రావాలి అన్న ఆకాంక్షతో.. ఈ ప్రభుత్వం పోవాలి అదే ప్రజా విజయంగా భావించి ముందుకు వెళ్లాలి.
• కొడుకు ఏసీ కొనుక్కుంటే తల్లి ఫించన్ కట్ చేశారు
రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా, మాధ్యమాల్లో వస్తున్న సమాచారం మేరకు చూస్తే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండడం మా దృష్టికి వచ్చింది. ఈ రోజు తెనాలి నియోజకవర్గ పర్యటనలో ప్రజల నోట ప్రభుత్వ పనితీరు తెలుసుకుంటే బాధ కలిగింది. పెద్ద పెద్ద పత్రిక ప్రకటనలు చేశారు. ఎక్కడ చూసినా బటన్ నొక్కి రూ. వేల కోట్లు వెళ్లిపోయాయని చెప్పడం. సంక్షేమ పథకాలు పెద్ద స్థాయిలో అమలు చేస్తున్నట్టు డబ్బా కొట్టడం చేస్తున్నారు. లబ్దిదారులకు మాత్రం చేరడం లేదు. ఇదంతా ప్రభుత్వ డొల్లతనం, నిజాయితీ లేని మాటలు. క్షేత్ర స్థాయిలో చూస్తే ఫించన్ల కోసం ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తున్న పరిస్థితి. గ్రామ స్థాయిలో చిన్న చిన్న కారణాలు చూపి చాలా మంది ఫించన్లు తీసేశారు. కొడుకు ఏసీ కొనుక్కుంటే తల్లి వృద్ధాప్య ఫించన్ కట్ చేసేశారు. నియోజకవర్గ పర్యటనలో రెండు సందర్భాల్లో ఆ పరిస్థితులు ఎదురయ్యాయి. గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కనీసం మరమ్మతులు చేపట్టలేదు. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన చూసి ముఖ్యమంత్రి వెంటనే తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహించి వర్షాకాలం పూర్తవగానే రోడ్లకు మరమ్మతులు చేసేస్తామని ప్రకటనలు చేశారు. ఇప్పుడు మళ్లీ వర్షాకాలం వస్తోంది. ఒక్క రోడ్డు మీద కనీసం తట్ట మట్టి వేసిన దాఖలాలు లేవు.
• ప్రజలు ప్రశ్నిస్తే సహనం కోల్పోతున్నారు
ప్రజాప్రతినిధులు గడపగడపకు వచ్చినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తే శాసనసభ్యులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ముందుగానే మనుషుల్ని పంపి ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదని బెదిరిస్తున్నారు. ఇక్కడ చూస్తే నందివెలుగు – పెదరావూరు ప్రధాన రహదారి ఎందుకు ఈ రోజుకీ పనులు ప్రారంభించలేకపోయారు. నాడు కేబినెట్ తీర్మానం చేసి నిధులు ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వంలోనూ, ఈ ప్రభుత్వం మూడేళ్ల పాలనలోనూ ప్రారంభించలేకపోయారు. తెనాలి చక్కటి ప్రాంతం. ఇప్పుడు అభివృద్ధిలో కుంటుపడిపోవడం బాధ కలిగించింది. మాట్లాడితే నిధులు లేవు ఏం అడగొద్దంటున్నారు.
• మీ పత్రికా సమావేశాలు ఎవరికి ఉపయోగం?
151 సీట్లు ఇచ్చి ప్రజలు అద్భుత విజయాన్ని కట్టబెడితే కనీసం మంచినీటి వసతి కల్పించలేకపోతున్నారు. కొలకలూరులో మంచినీటి ఇబ్బందులు ఉన్నాయని బాధ పడ్డారు. రూ. 96 కోట్లతో కృష్ణా నది నుంచి నీరు తెచ్చి గ్రామ గ్రామాన రక్షిత మంచినీరు ఏర్పాటు చేస్తే మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎందుకు పత్రికా సమావేశాలకే పరిమితం అయ్యి కొంత మంది లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. మీ మీడియా సమావేశాలు ఇక్కడ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి. మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలన పూర్తయ్యి నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. పక్క రాష్ట్రాల్లో చూస్తే కొత్త కొత్త పట్టణాలు వెలుస్తున్నాయి. రహదారులు వస్తున్నాయి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మార్కెట్ యార్డుల్లో చూస్తే ధాన్యం కొనుగోళ్లలో గోల్ మాళ్లు.. ఎరువుల అమ్మకాల్లో గోల్ మాళ్లు.. ఈ విధమైన ధోరణి ఎందుకు ఉపయోగపడుతుంది.
• అభివృద్ధి లేదు.. సంక్షేమం లేదు..
ఇంత మెజారిటీ ఇస్తే ఇంత దారుణంగా పాలన ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ఆయన్ని శాసనసభకు పంపిన పులివెందుల్లో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని దించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ. రాష్ట్రాభివృద్ది కోసం ప్రజల కోసం జనసేన పార్టీ కట్టుబడి ముందుకు వెళ్తుంది. తెనాలికి మంచి రోజులు రావాలి. ఇక్కడ అభివృద్ధి లేదు. సంక్షేమం లేదు. ఈ పద్దతి మార్చుకోవాలి.. ప్రభుత్వ పనితీరు ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ప్రభుత్వం ప్రజల కోసం అన్న చందంగా ఎక్కడా లేదు. ఈ ప్రభుత్వాన్ని దించి తీరాలి” అన్నారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, అడపా మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.