20 నుంచి శ్రీ నాగబాబు యూరప్ పర్యటన

ప్రవాస భారతీయుల సేవలను జనసేన పార్టీకి మరింత అనుసంధానం చేసేందుకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు యూరప్ దేశాలలో పర్యటించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో ఆయన వివిధ దేశాలలో పర్యటించి అక్కడున్న తెలుగు వారితో భేటీలు నిర్వహిస్తారు. జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ సానుభూతిపరులతో సమావేశం అవుతారు. ఈ నెల 20వ తేదీన లండన్ చేరుకొని 22వ తేదీన సౌత్ హారో ల జన సైనికులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. 23వ తేదీన ఐర్లాండ్ లోని డంబ్లిన్ నగరంలో జన సైనికులతో ప్రత్యేక సమావేశం ఉంటుంది. 29వ తేదీన నెదర్లాండ్స్ చేరుకొని ఆమ్‌స్టర్‌డ్యామ్ లో జనసేన పార్టీకి ఎన్నారైలు ఎలా తోడ్పాటునందించాలి అనే విషయంలో చర్చిస్తారు. ఈ నెల 30వ తేదీన జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో జన సైనికులు, వీర మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. విదేశాల్లో ఉండి జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో పార్టీకి సేవ చేయాలనుకునే ఎన్నారై లను వరుసగా కలుస్తున్న శ్రీ నాగబాబు గారు ఇప్పటికే అరబ్ దేశాల పర్యటనను పూర్తి చేశారు. ఇప్పుడు యూరప్ పర్యటనలో అక్కడ నివసిస్తూ జనసేన పార్టీ కోసం తమ వంతు సేవ చేయాలని భావిస్తున్న ప్రవాస భారతీయులను శ్రీ నాగబాబు గారు కలిసి పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యక్రమాలు, పార్టీ ఉన్నతికి అందించాల్సిన సేవలపై వారితో చర్చిస్తారు.. ఈ పర్యటనలో పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శ్రీ శశిధర్ కొలికొండ పాల్గొంటారు.