పేటీఎం బ్యాచ్ ద్వారా ప్రజల మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నారు

• శ్రీ పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు
• వైసీపీ కుట్రలను కాపు, బీసీ సోదరులు తిప్పికొట్టాలి
• సొంత డబ్బు పేదలకు ఖర్చు చేస్తున్న ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
• కాపు సంక్షేమ సేనతో సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

కాపు సోదరులు, బీసీలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కోరారు. గత ఎన్నికల్లోనే జరిగిన కుట్రపూరిత ప్రచారాన్ని నమ్మి.. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని విశ్వసించలేదు.. ఇప్పుడు కూడా ఏడాదికి రూ. 600 కోట్లు ఖర్చు చేసి పేటీఎం బ్యాచ్ ని పెట్టి మరీ సోషల్ మీడియా ద్వారా ప్రజల మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రయత్నాలను కాపు సోదరులు గుర్తించాలని కోరారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కాపు సంక్షేమ సేన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ… “శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాలనలో రాష్ట్రానికి మంచి పరిపాలన తీసుకురావాలి. ప్రజల కోసం ప్రతి రోజు రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న నాయకుడిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ జనసేన పార్టీని కించ పర్చే విధంగా చేస్తున్న ప్రయత్నాలను నమ్మవద్దు. ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించండి. వైసీపీ కుట్రలు కుయుక్తులను కాపు, బీసీ సోదరులు తిప్పికొట్టాలి.
* శ్రీ జగన్ రెడ్డిని ఇంటికి పంపండి
సొంత డబ్బు పేదలకు పంచి పెడుతున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. శ్రీ జగన్ రెడ్డిని ఇంటికి పంపండి. సంక్షేమం పేరిట ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వం క్షేత్ర స్థాయికి ఆ సంక్షేమ ఫలాలు చేరకుండా చేస్తోంది. జనసేన ప్రభుత్వంలో గతం నుంచి అమలు చేస్తున్న అన్ని పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా వర్తింప చేసే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు. కాపు సామాజకవర్గం సమస్యల పరిష్కారానికి పెద్దలు శ్రీ హరిరామ జోగయ్య గారు ఈ వయసులోనూ ఎంతో కృషి చేస్తున్నారు. సమస్యలు ఎప్పటికప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువస్తూనే ఉన్నారు. వారి సూచనలు ఎంతో విలువైనవి” అన్నారు.