అమిత్‌షా తో భేటీ అయిన విజయశాంతి

మాజీ ఎంపీ, సినీనటి విజయశాంతి.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. కాషాయం కండువా కప్పుకునేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం నాడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు. ఈ భేటీకి రాష్ట్రానికి చెందిన కీలక నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీలో కీలకమైన వ్యక్తి, మాజీ ఎంపీ వివేక్ హాజరయ్యారు. అమిత్‌షాతో భేటీ కి ముందు.. కిషన్‌రెడ్డి నివాసంలో భేటీ అయిన విజయశాంతి, బండి సంజయ్, వివేక్. ఆ తర్వాత అంతా కలిసి అమిత్‌షా దగ్గరకు వెళ్లారు. ఇదిలా ఉండగా. ఈ రోజు ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి కమలం పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆమెతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు జానా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.