సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ప్రకటనలో వివక్ష ఏమిటి?

•45 వేల మందిని పక్కనపెట్టే ప్రయత్నాలను సర్కార్ విడనాడాలి
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది ఉద్యోగుల పట్ల వివక్ష వైఖరి కనబరుస్తోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. సుమారు 45 వేల మంది సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇవ్వకుండా పక్కనపెట్టే ప్రయత్నాలు మొదలు కావడంతో సంబంధిత ఉద్యోగ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఉద్యోగ జీవితంలో మొదటి అడుగులు వేస్తున్నవారిని ఈ విధంగా మానసిక ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదు. రెండేళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్న అందరికీ ప్రొబేషన్ ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెంటనే ప్రొబేషన్‌ ప్రకటిస్తామని వారి నియామక సమయంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రొబేషన్ ఇవ్వాలనే న్యాయమైన తమ డిమాండును నెరవేర్చాలని కోరుతూ గాంధేయ ధోరణిలో నిరసన తెలిపిన వారిని ప్రొబేషన్ కు దూరం పెడుతున్న మాట నిజం కాదా? పేదల ఇళ్లకు సంబంధించిన వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)కీ ప్రొబేషన్ కు లింకుపెట్టి మరికొందరిని దూరం పెట్టడం నిజం కాదా? దీనిపై ప్రభుత్వ పెద్దలు వివరణ ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేస్తూ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారందరికీ ప్రొబేషన్ ప్రకటించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.